ఢిల్లీ యువకుడిపై ఏకకాలంలో దాడిచేసిన కరోనా, డెంగ్యూ!

  • కరోనా లక్షణాలతో ఆసుపత్రిలో చేరిన 20 ఏళ్ల యువకుడు
  • పడిపోతూ వచ్చిన ప్లేట్‌లెట్స్
  • చాలా ప్రమాదకరమన్న వైద్యులు
ఢిల్లీలో ఓ యువకుడిపై డెంగ్యూ, కరోనా ఒకేసారి దాడి చేయడం వైద్యులను విస్మయపరుస్తోంది. ఇలా రెండు వ్యాధుల బారిన ఒకేసారి పడడం అత్యంత ప్రమాదకరమని వైద్యులు పేర్కొన్నారు. జ్వరం, గొంతునొప్పి, నీరసం, ఆకలి లేమి వంటి సమస్యలతో 20 ఏళ్ల యువకుడు ఎయిమ్స్ ఆసుపత్రిలో చేరాడు. అతడికి నిర్వహించిన కొవిడ్ పరీక్షల్లో కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది. అయితే, అతడిలో పెద్దగా వైరస్ లక్షణాలు కనిపించనప్పటికీ ప్లేట్‌లెట్స్ పడిపోయాయి.

దీనికి తోడు శరీరంపై దద్దుర్లు కూడా రావడంతో అనుమానించిన వైద్యులు డెంగ్యూ పరీక్ష నిర్వహించారు. ఇందులో అతడికి డెంగ్యూ సోకినట్టు నిర్ధారణ కావడంతో వైద్యులు ఆశ్చర్యపోయారు. ఒకేసారి రెండు వైరస్ లక్షణాలు కనిపిస్తే చాలా అప్రమత్తంగా ఉండాలని వైద్యులు తెలిపారు. తాజా కేసులో బాధితుడు అశ్రద్ధ చేయకుండా తగిన సమయంలోనే ఆసుపత్రికి రావడంతో ప్రాణాపాయం తప్పిందని పేర్కొన్నారు.

Corona Virus
dengue
New Delhi
AIIMS

More Telugu News